హార్ముజ్ జలసంధిని అమెరికా తెరుస్తుంది.. చైనా సహా ఆ దేశాలు యుద్ధ నౌకలను పంపించాలి: ట్రంప్

  • హార్ముజ్‌ను ఇరాన్ మూసివేయడంతో ప్రభావితమైన దేశాలు నౌకలను పంపించాలన్న ట్రంప్
  • చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ తదితర దేశాలు నౌకలను పంపిస్తాయని ఆశాభావం
  • ఇరాన్ సైనిక స్థావరాలను 100 శాతం నాశనం చేశామన్న ట్రంప్
  • హార్ముజ్‌ను స్వేచ్ఛగా, సురక్షితంగా ఉంచుతామని హామీ
హార్ముజ్ జలసంధిని త్వరలో అమెరికా తెరుస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. హార్ముజ్‌ను ఇరాన్ మూసివేయడంతో ప్రభావితమైన దేశాలు ఇక్కడకు నౌకలను పంపించాలని ఆయన సూచించారు. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం 15వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ లాంటి దేశాలకు కీలక విజ్ఞప్తి చేశారు. హార్మూజ్ జలసంధి రక్షణ కోసం ఆ దేశాలు నౌకలను పంపించాలని అన్నారు.

అమెరికా నావికాదళం త్వరలో హార్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ట్రూత్ ప్లాట్‌ఫామ్ వేదికగా స్పందించారు. హార్ముజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో ప్రపంచంలోని అన్ని దేశాలు, ముఖ్యంగా ప్రభావితమైన దేశాలు అమెరికాతో కలిసి యుద్ధ నౌకలను పంపించాలని కోరారు. ఈ జలసంధిని మూసివేయడం వల్ల ప్రభావితమైన దేశాలు తమతో కలుస్తున్నాయని తెలిపారు.

ఇరాన్ సైనిక స్థావరాలను 100 శాతం నాశనం చేశామని ట్రంప్ పేర్కొన్నారు. తల తెగిన ఇరాన్ లాంటి దేశంతో ముప్పు ఉండదని స్పష్టమవుతోందని అన్నారు. ఇరాన్ తీర ప్రాంతంపై అమెరికా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. త్వరలో హార్ముజ్‌ను తెరుస్తామని, ఈ దారిని స్వేచ్ఛగా, సురక్షితంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. చైనా వంటి దేశాలు నౌకలను పంపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Donald Trump
Hormuz Strait
Iran
US Navy
China
France
Japan
South Korea
Britain

More Telugu News